Price: Rs.60.00 /-
No.Pages: 375.
సామ్యవాదమే నా గమ్యం, కవిత్వంలోనూ జీవితంలోనూ' అన్న శ్రీశ్రీ కవిత్వం భువన భవనపు బావుటాగా ఎగురుతూనే వుంటుంది. దాని గురించి ఎంత చర్చ జరిగినా ఇంకా మిగిలే వుంటుంది. కాని కొంతమందికి ఇదే గిట్టడం లేదు.నచ్చడం లేదు. శ్రీశ్రీని పునర్మూల్యాంకనం చేయాలని వారంతా మహా తొందరలో వున్నారు. అసలు ఏ మూల్యాంకనమైనా నిరంతరం సాగుతుంటుంది తప్ప ఒక బిందువు దగ్గర ఆగిపోదు. ఆ అవసరం లేని వారిని చరిత్ర తేలిగ్గా మర్చిపోతుంది. ఎవరి గురించైనా పునర్మూల్యాంకనం జరగాలని పదే పదే అంటున్నారంటే వారి ప్రభావం నిలిచి వుందని అర్థం. విచిత్రమేమంటే శ్రీశ్రీ విషయంలో సాహిత్య పరంగా ఆయన మహత్తర పాత్రపై సంపూర్ణ మూల్యాంకనమే సరిగ్గా జరిగినట్టు కనిపించదు. తెలుగు కవిత్వాన్ని ఊగించి దీవించి శాసించిన ఆయన మహత్తర కవిత్వంపైన, జన నిబద్ధమైన ఆయన జీవితంపైన ఏకోన్ముఖ పరిశీలనే సమగ్రంగా జరిగింది లేదు. కమ్యూనిస్టు నాయకులు మాత్రమే ఆయన మహత్తర పాత్రను మనస్ఫూర్తిగా ఆహ్వానించి జేజేలర్పించారు. శ్రీశ్రీ విశ్వరూపం ఇంకా విదితం గాని తొలి రోజులలో కొంతమంది ప్రముఖులు ఆహ్వానించారు. ముఖ్యంగా నిరంతర గమనశీలమైన కాలంలో కొత్త తరాలు వస్తూనే వుంటాయి. 'విధిగా వికసించే చరిత్రకొక నివాళి' అన్నట్టుగా నూతన తరాలకు శ్రీశ్రీ గురించి గత చర్చల పూర్వాపరాలు తెలియకపోవచ్చు. ఎవరు ఏ విషయం ఎందుకు చెబుతున్నారో అర్థం కాకపోవచ్చు. కనక శ్రీశ్రీ వంటి వారి గురించిన నిరంతర అధ్యయనం కొనసాగవలసిందే. ఈ పుస్తకం కూడ ఆ దిశలో ఒక చిన్న ప్రయత్నం.