Price: Rs.35.00 /-
No.Pages: 57.
జాషువా 1941లో గబ్బిలం వెలువర్చాడు. 20వ శతాబ్దంలో వచ్చిన ఆధునిక తెలుగు కావ్యాల్లో విశిష్టమైంది గబ్బిలం. ఖండకావ్య రచనలో సుమారు 22 సంవత్సరాలు పదునెక్కిన కలం సృష్టించిన అద్భుత ప్రతీకాత్మ కళాఖండం గబ్బిలం. ఖండకావ్య ప్రక్రియకు, ఊపిరులూది జవం జీవంతో తొణికిసలాడేలా చేసి ఆధునికాంధ్ర సాహిత్యంలో ప్రతిష్ఠాకరమైన స్థానం సంపాదించి పెట్టినవాడు జాషువ. సామాజిక అసమానతలపై ఏవగింపు, సంస్కరణల ఫలాలు చేతికి అందగలవన్న ఆశ రగుల్కొంటున్న తరుణంలో వర్ణాశ్రమ ధర్మాల పరిరక్షణను సమర్ధించే లక్షణాలు ముందుకొస్తున్నవైనం జాషువాను కలవరపరచాయి. హక్కుల సాధనకు ఉద్యమించే తరుణం ఆసన్నమైందని భావించాడు. హరిజనులుగా పిలవబడుతున్న వారిలో చైతన్యం రగిల్చి ఉద్యమించేలా చేసి దళితుల్లో ఆత్మగౌరవ సాధనకై తపించాలని ఊహించాడు. పీడకవర్గాల ముక్కుగుద్ది హక్కుల సాధనా దిశగా సాగిన మహాప్రస్థానంలో జాషువా ఎత్తిన అనల పతాకం గబ్బిలం. ఆగామి యుగంలో దళిత సూర్యుడి శిరసు నుంచిన అగ్ని కిరీటం గబ్బిలం.